సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా జనవరి 10, శుక్రవారం నాడు ఎంఐఎం పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టబోతుంది. ర్యాలీ తర్వాత నగర శివారు శాస్త్రీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అలాగే ఈ ర్యాలీకి యువత, పార్టీ కార్యకర్తలను పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. ముందుగా ర్యాలీలో పాల్గొనే వాళ్లంతా మిర్ అలాం ఈద్గా వద్దకు చేరుకొని అక్కడనుంచి హసన్నగర్, ఆరాంఘర్, మైలార్దేవ్పల్లి, శాస్త్రిపురం, కింగ్స్కాలనీ, బాబా కాంటా వరకు ర్యాలీని చేపట్టనున్నారు. ర్యాలీ అనంతరం జరిగే సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించనున్నారు.
ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన ర్యాలీ దృష్ట్యా హైదరాబాద్ మరియు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొద్ది రోజుల క్రితమే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా మిలియన్ మార్చ్ పేరుతో ట్యాంక్ బండ్పై వేలాది మంది ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మిలియన్ మార్చ్ వలన నగరంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం నిరసన ర్యాలీకి ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ప్రజలు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
[subscribe]