కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరి, హైడ్రామా గా మారుతుంది, బల పరీక్ష పై గంట,గంటకు పరిణామాలు మారిపోతున్నాయి, సంకీర్ణ ప్రభుత్వ సభ్యులు మరియు బిజెపి సభ్యుల మధ్య ఉదయం నుంచి శాసనసభలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. విశ్వాస తీర్మానంపై చర్చ మొదలైన తరువాత ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్, జెడిఎస్ చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, బిజెపి వారిని తప్పుదోవ పట్టించింది అని విమర్శించారు, విశ్వాస పరీక్షలో నెగ్గే సామర్థ్యం తమకుందని తెలిపారు. రాజీనామాలపై సుప్రీం కోర్టు తీర్పు అస్పష్టంగా ఉందని, ఇప్పుడు విశ్వాస పరీక్ష సరి కాదని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం మొదలయింది. స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేసారు, మళ్ళీ సభ మొదలైన తర్వాత కూడ పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో సాయంత్రం 4:30 గంటలకు వాయిదా వేశారు.
మరోవైపు విశ్వాస పరీక్ష ఆలస్యం అవ్వడంతో బిజెపి సభ్యులు గవర్నర్ వాజుభాయి ని కలిసి, బల పరీక్ష జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. తిరిగి సభ మొదలైన తరువాత గవర్నర్ పంపిన లేఖను సభలో స్పీకర్ చదివి వినిపించారు, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈరోజు రాత్రి కల్లా బల పరీక్ష నిర్వహించాలని అందులో గవర్నర్ ఆదేశించినట్టు స్పీకర్ సభ్యులకు వివరించారు. బల పరీక్ష నిర్వహించాలని స్పీకర్ ని గవర్నర్ ఆదేశించే అధికారం లేదని కాంగ్రెస్ సభ్యులు వాదానికి దిగారు. స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని బిజెపి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సభలో తీర్మానంపై చర్చ జరుగుతుంది, బలపరీక్ష జరుగుతుందా, వాయిదా పడుతుందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
[subscribe]
[youtube_video videoid=KXwTZ9eBZCs]