కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం, మరో 14 మంది గాయపడడం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “ఈ ప్రమాదానికి గురయినవారు పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసి తీవ్ర ఆవేదన కలిగింది. కుటుంబ సభ్యుడు మరణించగా దశదిన కర్మలో భాగంగా అంగడిదింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణంలోని సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం మాటలకు అందని విపాదంగా ఉంది. ప్రమాదానికి గురైన కుటుంబం వారు ప్రయాణించిన వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడపడమే కారణమని ప్రాథమిక సమాచారం వల్ల తెలుస్తోంది. గ్రామీణ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠినమైన చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రమాదంలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ రోడ్డు ప్రమాద బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. “తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అందజేయబడుతుంది” అని ప్రధాని మోదీ తెలిపినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ