ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేకే ముఖ్యమంత్రి 3 రాజధానులు అంటున్నారని, చట్ట ప్రకారం మూడు రాజధానులు సాధ్యం కాదని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించారు. SRM, VIT, NID కాలేజీలను సందర్శించారు. మందడంలోని టిడ్కో ఇళ్లను పరిశీలించిన సందర్భంగా లబ్ధిదారులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. మూడేళ్లుగా తిరుగుతున్నా ఇప్పటికీ తమకు ఇళ్లు అప్పగించడంలేదని వాపోయారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్లుగా అమరావతి రాజధాని నిర్మాణం జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో ఉద్దేశపూర్వకంగానే తాత్కారం చేస్తోందని విమర్శించారు.
హైకోర్టు తీర్పు ప్రకారం ఒక నెలలో పనులు మొదలు పెట్టాల్సి ఉందని, అయినా ఇప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభించలేదని ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఇది హైకోర్టు తీర్పును ధిక్కరించడమేనని అన్నారు. కనీసం మౌలిక వసతులు కల్పిస్తే పలు ప్రైవేట్ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. భూముల విషయంలో రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఎవరు అధికారంలో ఉన్నా ఈ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందేనని జీవీఎల్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో మడమ తిప్పారని విమర్శించారు. ఇంకా రెండేళ్లు సమయం ఉందని, ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలని ఎంపీ జీవీఎల్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ