తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు అధికార టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసందే. మూడు రాజ్యసభ స్థానాలకు గానూ.. ఉప ఎన్నిక స్థానంలో వద్దిరాజు రవిచంద్రకు అవకాశమివ్వగా మిగిలిన రెండు స్థానాలకు నమస్తే తెలంగాణ దిన పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్ రావు, ఫార్మా సంస్థ అధినేత బండి పార్థసారథి రెడ్డిలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త, ‘గాయత్రి రవి’ గా పేరొందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీ వద్దకు చేరుకున్న రవి ముందుగా గన్పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రవి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సుమారు రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు రవి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కేసముద్రం మండలం, ఇనగుర్తి గ్రామానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర ‘గాయత్రి గ్రానైట్స్’ అధిపతిగా తెలుగు రాష్ట్రాలలో సుపరిచితులు. కాగా గత ఎన్నికల్లో వరంగర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు. అనంతరం టిఆర్ఎస్ లో చేరిన గాయత్రి రవికి ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కడం విశేషం. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ తరపున పెద్ద సంఖ్యలో నాయకులు హాజరవడం విశేషం. వీరిలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ