ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. మొత్తం 6,15,980 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే ఫలితాల్లో బాలికలదే పైచేయి అయింది. బాలుర కన్నా బాలికలు ఉతీర్ణత సాధించడంలో ముందున్నారు. అలాగే ఫలితాల్లో ప్రకాశం జిల్లా 78.3 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా.. అనంతపురం జిల్లా 49.7 శాతంతో ఆఖరిస్థానంలో నిలిచింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 797 పాఠశాలల్లో విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని, మరో 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామని, పూర్తి సమాచారం కోసం bie.ap.gov.in, bse.ap.gov.in లలో ఫలితాన్ని సరిచూసుకోవచ్చని మంత్రి తెలిపారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేదని, రెండేళ్ల తర్వాత తొలిసారిగా రిజల్ట్స్ ప్రకటిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అయితే పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వచ్చేనెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఈ విద్యార్థుల కోసం ఈ నెల 13 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేవరకు వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వివరించారు. అలాగే ర్యాంకులపై నిషేధం అమలులో ఉందని.. జూనియర్ కాలేజీలు దీనిని దృష్టిలో ఉంచుకుని ర్యాంకుల ప్రకటన విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF