ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు “వైఎస్ఆర్ బీమా” పథకం కింద రూ.254 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులై ఉండి, బ్యాంకుల్లో పేర్లు నమోదు చేసుకోకముందే ఇప్పటివరకు మరణించిన 12039 మంది కుటుంబాలకు మానవతాదృక్పథంతో బీమా క్లెయిమ్ కు సమానమైన నగదును అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ఈ రోజు రూ.254 కోట్ల నగదును 12039 మంది యొక్క కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముందుగా 2020 అక్టోబర్ లో “వైఎస్ఆర్ బీమా” పథకాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా బియ్యం కార్డు ఉన్న లేదా దారిద్యరేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ బీమా పథకం కోసం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
బీమాలో కేంద్రప్రభుత్వం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం భరిస్తుందని, ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో బీమా జాబితా ఉంచారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వారు వయసు గలిగిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణమైతే రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని అన్నారు. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.1.50 లక్షలు, ఇక 51 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. మరోవైపు ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే గ్రామ సచివాలయం నుంచే రూ.10 వేలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ