కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతుంది. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ వెయిట్ లిఫ్టర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం భారత్ వెయిట్ లిఫ్టర్లు జెరెమీ లాల్రినుంగా, అచింత షూలి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 3 స్వర్ణ, 2 రజత, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 6 మెడల్స్ చేరగా, అన్ని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కావడం విశేషం.
పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా 300 కేజీలు (స్నాచ్లో 140 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 160 కేజీలు) ఎత్తి మొదటి స్థానంలో నిలవడంతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. జెరెమీ గాయపడినప్పటికీ మూడు క్లీన్ అండ్ జర్క్ ప్రయత్నాలు చేసి స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే పురుషుల 73 కేజీల విభాగంలో అచింత షూలి 313 కేజీలు (స్నాచ్లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 170 కేజీలు) ఎత్తి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అచింత షూలి స్నాచ్ తో పాటుగా టోటల్ లిఫ్ట్లలో కొత్త గేమ్ రికార్డును కూడా సృష్టించాడు. ఇప్పటివరకు వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, అచింత షూలి స్వర్ణ పతకాలు నెగ్గగా, సంకేత్ మహదేవ్ సర్గర్, బింద్యారాణి రజతాలు, గురురాజా పూజారి కాంస్య పతకం గెలుచుకున్నారు.
మరోవైపు కామన్ వెల్త్ గేమ్స్-2022 లో వెయిట్ లిఫ్టింగ్ లో ఆదివారం స్వర్ణాలు సాధించిన జెరెమీ లాల్రినుంగా, అచింత షూలి లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. “మన యువశక్తి చరిత్ర సృష్టిస్తోంది. తన మొట్టమొదటి కామన్ వెల్త్ గేమ్స్ లోనే స్వర్ణం గెలుచుకున్న మరియు అసాధారణమైన కామన్ వెల్త్ గేమ్స్ రికార్డును కూడా నెలకొల్పిన జెరెమీ లాల్రినుంగాకు అభినందనలు. చిన్న వయస్సులోనే అపారమైన గౌరవం మరియు కీర్తిని తెచ్చాడు. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ప్రధాని ట్వీట్ చేశారు. ఇక “టాలెంటెడ్ అచింత షూలి కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉంది. అతను తన ప్రశాంత స్వభావానికి మరియు మొండి పట్టుదలకు ప్రసిద్ధిగా ఉన్నాడు. ఈ ప్రత్యేక విజయం కోసం అతను చాలా కష్టపడ్డాడు. అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు”అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY