ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే రోజున ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం తక్షణమే ఆమోదించడం విశేషం. అయితే రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అధికారికంగా సమర్పించడానికి ముందుగా సోమవారం స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. అంతకు ముందు ఆయన గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమ వీరులకు నివాళులర్పించారు. కాగా తన రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించుకోవాలనే లక్ష్యంతో ఆయన సాంకేతిక లోపాలకు తావీయకుండా పక్కా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించడం గమనార్హం.
అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం దేనినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని సహించదని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, దీనికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసమే తన పదవిని త్యాగం చేస్తున్నట్లు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి, నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చిందని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే చారిత్రాత్మక తీర్పును ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY