ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణకోసం దిశా పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 9న రాజమహేంద్రవరంలో తోలి దిశ పోలీస్స్టేషన్ ప్రారంభించారు. అలాగే ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలో 18 దిశ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిశా పథకం అమలుకోసం రూ.47.93 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు పాలనా పరమైన అనుమతిని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దిశా చట్టంపై ఇంకా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఆమోదం రానందు వలన ప్రస్తుతానికి దిశ పథకంగా పరిగణించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిశా పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు, తదితర అంశాలకు సంబంధించి ఈ నిధులను హోంశాఖ ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
మరోవైపు పలు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధం, పర్యవేక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఏడుగురు అధికారులు, ఇతర సిబ్బందితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
[subscribe]