ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ అనే పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. ఎవరైనా గీత కార్మికుడు ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి జారిపడి మరణించినట్లయితే.. ఆ కుటుంబానికి ఈ పథకం కింద పరిహారం అందించనున్నారు. తాజాగా ఈ పథకం కింద అందించే పరిహారాన్ని రూ.10 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన సందర్భంలోనే కాకుండా, చెట్టుపైనుంచి పడిన సందర్భంలో శాశ్వత అంగవైకల్యం సంభవించినా సరే, వారికి కూడా రూ.10 లక్షలు పరిహారం అందించనున్నారు. దీనిప్రకారం.. రూ.5 లక్షలు కార్మిక శాఖనుంచి, మరో రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అందజేస్తారు. ఈ మేరకు గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కల్లు గీత విధానం 2022-2027 ప్రకారం ఈ పరిహారం మొత్తాన్ని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
కాగా రాష్ట్రంలో దాదాపు 95,245 కుటుంబాలు తమ కులవృత్తి అయిన కల్లు గీత పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఏటా దాదాపు 1200 మంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో 40శాతం మంది దుర్మరణం పాలవుతున్నారు. మిగిలినవారిలో అధికశాతం మంది శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. గతంలో వీరికి ప్రభుత్వం తరపున అందే పరిహారం రూ.2 లక్షలుగా ఉండేది. కానీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో అది రూ.10 లక్షలు అయింది. దీంతో కల్లు గీత కార్మిక కుటుంబాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE