అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 24,25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నట్లు ఫిబ్రవరి 10, సోమవారం నాడు వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాట్రంప్ తో కలిసి భారత్కు రానున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు వర్గాల ప్రజలతో ట్రంప్ ముచ్చటించనున్నారని తెలిపారు. ట్రంప్ పర్యటన అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అమెరికన్ మరియు భారత ప్రజల మధ్య బలమైన, శాశ్వతమైన బంధాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని వైట్హౌస్ పేర్కొంది. కాగా ట్రంప్ భారత్కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫిబ్రవరి మొదటివారంలో ప్రధాని మోదీ, ట్రంప్ పర్యటనపై ఫోన్లో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఉభయ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై గత కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన సందర్భంగా ఒప్పందం ఖరారవుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే విధంగా చర్చలు జరపనున్నారు. సైనిక కొనుగోలు ఒప్పందాలు, చమురు, సహజ వాయువు సరఫరా, ఇతర ప్రపంచ దేశాలలోని తాజా పరిస్థితులు, ఇతర భద్రతా విధానాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
[subscribe]