వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27, గురువారం నాడు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించింది. అయితే రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ పరిణామాల అనంతరం చంద్రబాబు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు.
విజయనగరం జిల్లాలోని విజయనగరంతో పాటుగా గజపతి నగరాల్లో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే విశాఖపట్నం పర్యటనలో భాగంగా పెందుర్తి ల్యాండ్ పూలింగ్ బాధితులతో చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. అనంతరం శృంగవరపు కోట, కొత్తవలసలో ప్రాంతాలలో అన్నక్యాంటీన్ల తొలగింపుపై చేపట్టే నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు.
[subscribe]