హైదరాబాద్ లోని నోవాటెల్ లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పథం మారాలని, ప్రపంచానికి అవసరమైన ఆహారం రావాల్సింది వ్యవసాయం నుండేనని అన్నారు. వ్యవసాయం సుస్థిరం, సమర్దవంతం కావాలంటే నాణ్యమైన విత్తనమే ప్రధానమని, అందులో భాగంగా వివిధ పంట రకాలను విస్తరించడానికి పరిశోధనలు ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ప్రైవేటు పరిశోధనా సంస్థలు ఉన్నాయి, పరిశోధనలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జరుగుతున్నాయని, అవి మరింత సమన్వయంతో జరగాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో నకిలీ విత్తన విక్రేతలపై పీడి యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ:
“విత్తన పరిశోధన ప్రైవేటు రంగంలో ఎక్కువగా ఉన్నది. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు కనుక ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అందించడం ప్రథమ కర్తవ్యం. దాంతో పాటు నాణ్యమైన పోషకాహారంపై దృష్టిపెట్టాలి. నాణ్యమైన పోషకాహారం అందించడంలో ప్రపంచం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 2015లో జరిగిన ఐక్యరాజ్యసమితి జెనీవా సదస్సులో 17 అంశాలలో ప్రపంచం ముందు ఉంచి ప్రపంచ దేశాలు వాటిపై దృష్టి పెట్టాలని సూచించింది. అందులో నాణ్యమైన ఆహారం ఒకటి, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. నాణ్యమైన ఆహారం అందించాలంటే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మన ప్రధాన విధి. ప్రపంచంలో భారతదేశం నాణ్యమైన విత్తన ఉత్పత్తి దారుల్లో ముందున్నది. అందులో తెలంగాణ రాష్ట్రం మరింత ముందున్నది. కరోనా విపత్తులో విత్తన ఉత్పత్తి రంగం, విత్తన పరిశ్రమ రంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను దేశం అంతటా అనుసరించడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం విత్తనరంగం పటిష్టానికి అనేక చర్యలు తీసుకున్నది. విత్తనరంగానికి ప్రోత్సాహమిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ ఏర్పడే నాటికి నకిలీ విత్తనాలు పెద్ద సమస్య. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో తొలిసారి పీడీ యాక్ట్ ప్రవేశపెట్టారు. దేశంలో నకిలీ విత్తన విక్రేతలపై పీడి యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ” అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
“ఈ జాతీయ విత్తన సదస్సులో విత్తన విక్రేతలు, పరిశోధకులు, ఉత్పత్తిదారులు, పరిశ్రమవర్గాలు లేవనెత్తిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. విత్తన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కేంద్రం మీద వత్తిడి తెస్తాం. రాబోయే తరాలకు విత్తన పరిశ్రమ ఉత్తమ ఫలితాలను అందించాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దేశంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాలి. జాతీయ వ్యవసాయ విధానం మార్పుపై కేంద్రం దృష్టిసారించాలి” అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ జాతీయ విత్తన సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్.కె పట్నాయక్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐకార్ సీడ్స్ డీజీ డాక్టర్ డీకే యాదవ, తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, ఇస్టా వైస్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ అల్లెన్, ఎఫ్ఎస్ఐఐ వైస్ ప్రెసిడెంట్ పరేశ్ వర్మ, కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ కమీషనర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE