తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 27, గురువారం నాడు భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కృష్ణమూర్తిని ఈ రోజు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల సేకరణ అంశాల గురించి కేటీఆర్ వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణమూర్తిని మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే మరో కార్యక్రమంలో అమెరికా ఆధారిత హెల్త్ కేర్ కంపెనీ ప్రొవిడెన్స్ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రొవిడెన్స్ ఈవీపీ మరియు సిఐఓ బి జే మూరే, కంపెనీ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
[subscribe]