రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. ఏప్రిల్ 14, మంగళవారం నాడు మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మెడికల్, పోలీస్ మరియు జీహెచ్ఎంసీ జోనల్ అధికారులతో కరోనా నివారణ చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగిందని, కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించడం ఒకటే మార్గమని, ముఖ్యంగా హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో100 శాతం లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, పూర్తిగా అన్ని రహదారులను మూసివేసి ఒకటే మార్గం పోలీసుల పహరాలో తెరచి ఉంచాలని, ఏ ఒక్కరు బైటికి రావొద్దని, వారికి కావలసిన నిత్యావసర వస్తువులు ఇంటికే పంపించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సభలు, సమావేశాలు ఎటువంటి సామూహిక పంపిణీ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో చేపట్టరాదని, ఎవరైనా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అనుకుంటే పోలీస్ లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకుని, అనుమానితులను హాస్పిటల్ కు తరలించి కావలసిన వైద్య పరీక్షలు చేయించి పాజిటివ్ రిపోర్ట్ వస్తే సంబంధిత హాస్పిటల్ కు పంపించడం, ట్రావెల్ హిస్టరీ వివరాలతో పాటు, కాంటాక్ట్ వివరాలను వెంటనే సేకరించి తదుపరి చర్యలు తీసుకోవాలని, పోలీస్, జీహెచ్ఎంసీ మరియు మెడికల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, వైద్య పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు, డాక్టర్లు సమన్వయంతో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా హైద్రాబాద్ సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో అప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, అవసరమైన అంబులన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలని, ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే అటువంటి అనుమానితులను వెంటనే ఆసుపత్రికి పంపించాలని చెప్పారు. అనుమానితులు నుండి శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అనుమానితులకు ఎవరికైనా వైద్య లేదా ఇతర అత్యవసర సర్వీస్ ల కోసం 104 లేదా జీహెచ్ఎంసీలోని 040 21111111 నెంబర్ కి కాల్ చేయొచ్చని ఆయన అన్నారు
అలాగే ఈ సమావేశంలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలోని అన్ని ప్రాంతాల్లో పోలీస్, మెడికల్ మరియు మున్సిపల్ అధికారులతో, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్పటికప్పుడు డే అండ్ నైట్ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. అనుమానితులను క్వారంటీన్ చేయడం, లేదా హాస్పిటల్స్ కు పంపడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]