వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సూర్య బెజవాడ ఆధ్వర్యంలో ఇండో కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి వారికి వివరించారు. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ప్రభుత్వ పరంగా చేయూతను అందించి ప్రోత్సహించాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా మత్స్యకారుల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్బావంకు ముందు రాష్ట్రంలో సరైన నీరు, విద్యుత్ ఉండేది కాదని, నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపుతో కాళేశ్వరం వంటి నూతన సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం వలన పెద్ద సంఖ్యలో నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి నీటి వనరులో చేప పిల్లలను విడుదల చేస్తున్న విషయాన్ని వివరించారు. అదేవిధంగా పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. మిషన్ భగీరధ కార్యక్రమం ద్వారా ఇంటింటికి సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, నూతన పరిశ్రమల ఏర్పాటుకు వాతావారణం అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండటం వలన అనేక దేశాల నుండి వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెడుతున్నారని, తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఎంతో అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధులు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రస్తుతం విదేశాలలో ఉన్నందున ఆయన వచ్చిన అనంతరం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రిని కలిసిన వారిలో ఇండో కెనడా కో ఆర్డినేటర్ త్రిభువన్ ఆనంద్, వికాస్ గుప్త, కల్పేష్ జోషి తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE