తెలంగాణ పోలీసులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు షాక్ ఇచ్చారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో ఆయన కుమారుడు భగీరథ్పై కేసు నమోదు చేసినట్లు దుండిగల్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. మహీంద్ర యూనివర్సిటీ స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ సుఖేశ్ ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్ రావ్ వెల్లడించారు. కాగా హైదరాబాద్ నగరశివారు బహదూర్పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో (టెక్ మహీంద్ర) బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో సదరు విద్యార్థిని పదే పదే చెంపదెబ్బలు కొట్టిన భగీరథ్ వీడియో వైరల్గా మారింది. దీనిలో భగీరథ్ స్నేహితుడైన మరో వ్యక్తి కూడా విద్యార్థిపై దాడి చేయడం కనిపించింది.
అలాగే మరో వీడియోలో అదే విద్యార్థిని భగీరథ్ సహా అతని హాస్టల్ గదిలో దాదాపు ఐదారుగురు దుర్భాషలాడుతూ కొట్టడం కనిపిస్తోంది. ఈ దాడి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అతను తన క్లాస్మేట్ సోదరితో అనుచితంగా ప్రవర్తించినందువల్లే ఈ గొడవకు దారి తీసిందని భగీరథ్ తెలిపాడు. ఇక ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం, బండి సంజయ్ కార్యాలయం కూడా ఒక వీడియోను విడుదల చేసింది. అందులో బాధిత విద్యార్థి తాను అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించానని ఒప్పుకోవడం కనిపిస్తుంది. భగీరథుడి స్నేహితుడి సోదరికి తాను అభ్యంతరకరమైన సందేశాన్ని పంపానని, ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నాడు.
ఇక తన కుమారుడు భగీరథపై దుండిగల్ ఠాణాలో కేసు నమోదవ్వడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు చేతనైతే తనతో రాజకీయం చేయాలని, అంతేకానీ చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగి లబ్ది పొందాలని చూడటం అనైతికమని మండిపడ్డారు. తానే తప్పు చేసినట్లు శ్రీరామ్ అనే అబ్బాయి ఒప్పుకొన్నాడని, అయినా.. ఇది చిన్న పిల్లల గొడవ అని, వారు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు. కానీ ఇందులో కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన కుమారుడిపై ఎవరు ఫిర్యాదు చేశారు? రాజకీయ లబ్ది కోసం తన కొడుకుతో సహా ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తారా? అని సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు తప్పు చేసినట్లు తేలితే తానే అతడిని పోలీసుల ముందు సరెండర్ చేస్తానని, తన కొడుకుపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? లాఠీలతో కొడతారా? అప్పుడు చూద్దామని అన్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వేధింపులను ఆపడం చేతగాదు కానీ, చిన్న పిల్లలపై కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయలని చూడటం దారుణమని మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE