భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర రాజ్యాంగ సభ సభ్యులకు నివాళులు అర్పించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ ఇలా అన్నారు.. ’74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, స్వదేశంలో మరియు విదేశాలలో ఉన్న ప్రతి భారతీయునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి నేటి వరకు, ఇది అనేక ఇతర దేశాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రయాణం. మన రాజ్యాంగంలో సుదీర్ఘమైన మరియు లోతైన ఆలోచనా విధానం ఉంది. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డా. బీఆర్ అంబేడ్కర్ కు దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది. రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.’ అని పేర్కొన్నారు.
ఇంకా రాష్ట్రపతి తన ప్రసంగిస్తూ.. ‘ అలాగే మన రాజ్యాంగ రూపకల్పనలో నాడు ఎంతోమంది ఇతర నిపుణులు మరియు అధికారులు సహకరించారు. ఆ అసెంబ్లీలోని సభ్యులు భారతదేశంలోని అన్ని ప్రాంతాలు మరియు సంఘాలకు ప్రాతినిధ్యం వహించినందుకు మరియు వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. ఇక స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మనం లెక్కలేనన్ని సవాళ్లను, ప్రతికూలతలను ఎదుర్కొన్నాం. అయినా ఆశ మరియు విశ్వాసంతో పేదరికం, నిరక్షరాస్యతలను అధిగమించాం. అలాగే అనేక మతాలు మరియు అనేక భాషలు మనలను విభజించలేదు, కాల పరీక్షను తట్టుకుని అవి మనల్ని ఏకం చేశాయి, కాబట్టి మనం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా విజయం సాధించాము. మహాత్మా గాంధీ నేతృత్వంలోని జాతీయ ఉద్యమం, దశాబ్దాల పోరాటం మరియు త్యాగం వంటివి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాయి. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలి’ ముర్ము తెలిపారు.
‘అలాగే ఇటీవలి సంవత్సరాలలో పాలన యొక్క సమర్ధత మరియు ప్రజల సృజనాత్మక శక్తిని వెలికితీసే కార్యక్రమాల ఫలితంగా, ప్రపంచం భారతదేశాన్ని కొత్త గౌరవంతో చూడటం ప్రారంభించింది. తద్వారా వివిధ ప్రపంచ వేదికలపై మన దేశాన్ని సానుకూల దృక్పథంతో చూడటం ప్రారంభించాయి. ప్రపంచ వేదికపై భారతదేశం సంపాదించిన గౌరవం కొత్త అవకాశాలతో పాటు బాధ్యతలను కూడా కలిగి ఉంది. ఈ క్రమంలో జీ-20 సభ్య దేశాల కూటమికి నాయకత్వం వహించే అవకాశం రావడం గొప్ప విషయం. దీనిని ప్రజాస్వామ్యం మరియు బహుపాక్షికతను ప్రోత్సహించడానికి ఒక అవకాశంగా తీసుకుని మెరుగైన ప్రపంచాన్ని మంచి భవిష్యత్తు వైపు మరల్చడానికి సరైన వేదికగా భారత్ ఉపయోగించుకోనుంది. భారత్ నాయకత్వంలో జీ-20 మరియు ప్రపంచాన్ని వేధిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరకనుందని ఖచ్చితంగా భావిస్తున్నాను’ అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE