వేసవి సమీపిస్తున్న తరుణంలో అటవీ రక్షణకు, అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ కోరారు. అరణ్య భవన్ లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. గత యేడాది కాలంగా అటవీ శాఖలో చేపట్టిన పనుల పురోగతి, రానున్న ఏడాదిలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ రెండు రోజుల సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అడవులపై పెరిగిన ఒత్తిడి కారణంగా రక్షణ చర్యల విషయంలో రాజీ పడవద్దని పీసీసీఎఫ్ కోరారు. వేసవిలో అగ్ని ప్రమాదాల రూపంలో అడవులకు ముప్పు పొంచి ఉంటుందని, నివారణ కోసం బీట్ల వారీగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. అటవీ సమీప గ్రామాల ప్రజల్లో, అడవుల గుండా ప్రయాణించే ప్రయాణీకుల్లో అవగాహన పెంచాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా వీలైనంత వరకు నివారించాలని తెలిపారు. వేసవిలో వన్యప్రాణుల తాగునీటి కోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.
రానున్న వర్షాకాలంతో ప్రారంభమయ్యే తెలంగాణకు హరితహారం సీజన్ కు నర్సరీలను సిద్దం చేయాలని, వేగంగా పెరిగే స్థానిక జాతుల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఔషధ మొక్కలు, హెర్బల్ గార్డన్ల పెంపకానికి అర్బన్ పార్కుల్లో ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపారు. ఇళ్లల్లో పెంచుకునేందుకు వీలుగా పంపిణీకి కూడా సిద్దం చేయాలని ఆదేశించారు. హరితవనాల్లో వందశాతం పచ్చదనం పెంపుపై సమీక్షించారు. వీలున్న అన్ని చోట్లా బాధ్యతాయుతమైన పర్యావరణ పర్యాటకం (ఎకో టూరిజం) అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. మంచి వర్షాల వల్ల నీటి లభ్యత పెరిగిందని, ఇదే అదనుగా అడవుల్లో నీటి నిల్వల సామర్థ్యం, నేలల్లో తేమ పరిరక్షణ (సాయిల్ అండ్ మొయిశ్చర్ కన్జర్వేషన్) చర్యలు తీసుకోవటం వల్ల అడవుల సహజ పునరుద్దరణ వేగం పెంచవచ్చని సూచించారు. అటవీ శాఖ చేపట్టిన పనులు, పచ్చదనం పెంపు వల్ల అన్ని వర్గాల నుంచి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయని, శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, క్షేత్ర స్థాయి సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని పీసీసీఎఫ్ కోరారు.
ఇంకా సమావేశంలో కంపా నిధులు, పనులు, పురోగతి, అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం, గిరిజన గూడేలకు మౌళిక సదుపాయాల కల్పన, అటవీ నేరాల కేసుల సత్వర పరిష్కారం, తదితర విషయాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎం.సీ. పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అన్ని సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE