దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన తీవ్ర భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ టర్కీ మరియు ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్రతకు వందలాది భవనాలు నేలకూలాయి. ఇక ఈ ఘటనలో దాదాపు 1600 మందికి పైగా మృతి చెందగా.. వేలమందికి గాయాలయ్యాయని ఆ దేశాధినేతలు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఇక ఈ భూకంపం ప్రధాన కేంద్రం టర్కీ ప్రావిన్షియల్ రాజధాని గాజియాంటెప్ నగరం వెలుపల సిరియా సరిహద్దు నుండి 90 కిలోమీటర్ల (60 మైళ్ళు) దూరంలో భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్మెంట్లు కూలిపోవడంతో భారీ ఆస్తినష్టం జరిగింది. ఈ క్రమంలో ప్రజలు భయాందోళనలతో హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ భూకంపం తర్వాత ఇరుదేశాలు హైఅలర్ట్ ప్రకటించాయి.
సిరియాలో దశాబ్దానికి పైగా సాగిన అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం ఇప్పటికే ఆర్ధికంగా శిలావస్థకు చేరగా.. తాజాగా వచ్చిన ఈ భూకంపం కోలుకోలేని దెబ్బ తీసింది. మరోవైపు పొరుగున ఉన్న టర్కీలో లక్షలాది మంది సిరియన్ శరణార్థులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం భూకంపం కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు మొదటి ప్రకంపన తర్వాత ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది. సగటున సుమారు 6.6 తీవ్రతతో ఇవి నమోదయ్యాయని టర్కీ అధికారులు తెలిపారు. టర్కీలోని గాజియాంటెప్ మరియు కహ్రామన్మరాస్ ప్రావిన్సులలో దాదాపు 900 భవనాలు ధ్వంసమయ్యాయని వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఓట్కే తెలిపారు. మెడిటరేనియన్ తీర నగరమైన ఇస్కాండెరౌన్లో ఒక ఆసుపత్రి కూలిపోయిందని, దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందని ఆయన చెప్పారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 2,800 సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లను మోహరించినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు భూకంపం సంభవించిన ప్రాంతాలకు వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపించామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ట్విట్టర్లో తెలిపారు. సహాయక చర్యలు కోసం పెద్ద ఎత్తున సైనిక బలగాలను దించామని ఆయన వెల్లడించారు. ఏడు టర్కీ ప్రావిన్సుల్లో 700 మందికి పైగా మరణించారని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇంకో 440 మంది గాయపడ్డారని ఏజెన్సీ పేర్కొంది. టర్కీలోని గజియాన్టెప్, కహ్రమాన్మరస్, హటాయ్, ఒస్మానియె, అడియమన్, మలట్య, అడన, కిలిస్ తదితర నగరాలపై భూకంప ప్రభావం ఉన్నట్టు టర్కీ దేశీయాంగ మంత్రి సులేమాన్ సోయిల్ తెలిపారు. టర్కీ, సిరియా ఆసుపత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. గాయపడ్డవారిలో చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక సిప్రస్, టర్కీ, గ్రీస్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యూకే, ఐరాక్, జార్జియాలోనూ ప్రకంపనలు సంభవించాయి.
ఇక ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఈ ఘటనపై స్పందించారు. బాధిత దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ ఆపత్కాలంలో అండగా ఉంటామని ఆ దేశాలకు భరోసానిచ్చారు. ఈ క్రమంలో తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీ పంపిస్తున్నారు. అలాగే గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా పంపించనున్నారు. మెడికల్ బృందాల్లో శిక్షణ పొందిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉండనున్నారు. ఇక ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో కనీసం వందమంది వరకు సిబ్బంది ఉంటారని, వీరు టర్కీ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా డాగ్ స్క్వాడ్ కూడా వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE