తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.2,90,396 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను రూపొందించారు. కాగా ఈ బడ్జెట్ లో వైద్య, ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు ప్రతిపాదించడమైనదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
బడ్జెట్ సందర్భంగా వైద్య, ఆరోగ్య రంగం గురించి మంత్రి హరీశ్ రావు వెల్లడించిన వివరాలు:
- పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
- రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల 2014 లో 92 గా ఉన్న మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) 2022 నాటికి గణనీయంగా తగ్గి 43కు చేరింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉంది.
- శిశు మరణాల రేటు (ఐఎంఆర్) 2014 లో 39 ఉండగా, ప్రస్తుతం అది 21కి తగ్గింది.
- ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లతో వైద్యవిద్యలో తెలంగాణ ప్రప్రథమస్థానంలో ఉంది. అదే విధంగా మెడికల్ పీజీ సీట్లలో ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో రెండోస్థానంలో ఉంది.
- రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేవలం 1400 ఆక్సిజన్ బెడ్ లు ఉంటే, వాటి సంఖ్యను ఇరవై రెట్లు పెంచి 27,966 బెడ్ లకు చేర్చటం జరిగింది.
- కంటి వెలుగు: రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుంది. తొలిదశ విజయం స్ఫూర్తితో రెండవదశ కంటి వెలుగు నేత్రవైద్య శిబిరాలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నది. కంటిచూపు సమస్యల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 2018 లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం 1 కోటి 54 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, 40 లక్షలకు పైగా కళ్ళద్దాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఇటీవలనే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తమ తమ రాష్ట్రాల్లోనూ కంటివెలుగును అమలు చేస్తామని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం.
- సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్దఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. రాజధాని నగరం హైదరాబాద్ నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతాల్లో ప్రభుత్వం భారీ ఎత్తున సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టింది. ఇందులో 2,679 కోట్ల రూపాయలతో మూడు ఆస్పత్రుల పనులు ప్రారంభమైనాయి. ఈ ఆసుపత్రుల నిర్మాణంతో 4,200 పడకలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వం వైద్య సేవలను అందుబాటులో తేనుంది. వీటితో పాటు నిమ్స్ లో మరో 2 వేల పడకలు అదనంగా అందుబాటులోకి తెస్తున్నది.
- వరంగల్లులో హెల్త్ సిటీ: తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హెల్త్ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తిచేసి, ప్రారంభించాలని ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉంది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని, అందుకు తగిన స్థాయిలో భవనాలు, వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతుంది.
- జిల్లాకో మెడికల్ కాలేజీ: తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృత పరిచేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే మెడికల్ కాలేజీలు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలలో మరో నాలుగు కాలేజీలు ప్రారంభించుకొన్నాం. ఈ విద్యాసంవత్సరంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రామగుండంలలో ఇంకో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాం. సీఎం కేసీఆర్ ఈ కాలేజీల్లో బోధనా కార్యక్రమాలను ఒకేసారి ప్రారంభించారు.
- 2023 సంవత్సరంలో నిర్మల్, ఆసిఫాబాద్, భూపాల్ పల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్ లలో మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరనుంది. ఈ కాలేజీలకు అనుబంధంగా ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైనది.
- ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2014లో 850 ఉంటే, అవి 2022 నాటికి 2,915కు పెరిగాయి. పీజీ సీట్లు 2014లో 515 ఉంటే అవి 2022 నాటికి 1,208కి పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలుపుకుంటే.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 6,715, పీజీ సీట్లు 2548 ఉన్నాయి.
- మరో 100 బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు: గతంలో హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు సుస్తీ చేస్తే ప్రైవేటు దవాఖానాలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో ఉండేవి కావు. నిరుపేదల బస్తీలలో చక్కని సౌకర్యాలతో వైద్యశాలలను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 342 బస్తీ దవాఖానలు పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలనందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖానాల్లో అందిన సేవలను క్యుములేటివ్ గా లెక్కిస్తే రెండు కోట్ల మేరకు ఓపీ సేవలందాయి. వీటికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మరో వంద బస్తీ దవాఖానలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవంతమైన బస్తీ దవాఖానాల స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అప్ గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ప్రాథమిక వైద్య సేవలు, గ్రామీణ ప్రజలకు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి.
- డయాలసిస్ సేవలు: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం మూడంటే మూడే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్ ఉదార హృదయంతో డయాలసిస్ పేషంట్లకు ఆసరా పింఛన్ల సైతం అందిస్తుండటంతో వారికెంతో ఊరట లభించింది. వీరికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
- మాతాశిశు ఆరోగ్యం, పౌష్టికాహారం: మాతృమరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక చెప్తున్నది. రాష్ట్రంలో ఎంఎంఆర్ ఈరోజున నలబై మూడుగా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకొన్నది. చిత్తశుద్ధితో, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తీసుకొన్న కార్యాచరణ మూలంగానే ఇది సాధ్యపడింది.
- కేసీఆర్ కిట్: గర్భం ధరించిన దశలో శ్రామిక మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉదాత్త లక్ష్యంతో 2017 జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు సురక్షితంగా ప్రసవించాలనే లక్ష్యం కూడా ఈ పథకంలో ఉంది. కేసీఆర్ కిట్ లో తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ ను ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటివరకు 13.91 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. 2015-16లో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 30.5 శాతం మాత్రమే ఉండేవి, కేసీఆర్ కిట్ పథకం అమలుతోపాటు, ఎంసీహెచ్ హాస్పిటళ్లను బలోపేతం చేయడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపై 61 శాతానికి పెరిగింది.
- కేసీఆర్ న్యూట్రిషన్ కిట్: గర్భవతులలో పోషకాహారలోపం తలెత్తకుండా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గర్భిణుల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, వికారాబాద్ లలో ఈ కార్యక్రమాన్ని 21 డిసెంబర్, 2022న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 4 లక్షల మంది గర్భిణీలు ప్రతిఏటా లబ్ది పొందుతారు. ఈ పథకం కోసం బడ్జెట్ లో 200 కోట్లు ప్రతిపాదించడమైనది.
- పాలియేటివ్ కేర్: మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలందిస్తాయి. ఇప్పటివరకు 33 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో ఐదో వంతు తెలంగాణలోనే ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE