నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 19న నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ కాగా, ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సుభాష్రెడ్డిని పేరును ఖరారు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి గురువారం నాడు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మార్చ్ 18, బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం నాటికీ బీజేపీ తరపున లక్ష్మీ నారాయణ పోతంకర్, టిఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత, నర్సింగ్ రావు లోయపల్లి నామినేషన్లు దాఖలు చేసినట్టు ఈసీ అధికారులు ప్రకటించారు.
గతంలో పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హుడిగా ప్రకటించారు. ముందుగా టిఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరెడ్డి, ఆతర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాడని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని టిఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది.
[subscribe]