కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణ చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మార్చ్ 19, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈరోజు సాయంత్రం ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ముందుగా నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా వైరస్ సోకగా, తాజాగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో మరొకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు బుధవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 109 మంది బ్లడ్ సాంపిల్స్ సేకరించారని, వారిలో 94 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. అదే విధంగా మరో 13 మంది సాంపిల్స్ యొక్క ఫలితాలు రావాల్సి ఉందని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఇతర కోచింగ్ సంస్థలకు మార్చ్ 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.