తెలుగు రాష్ట్రంలో కోవిడ్-19(కరోనావైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రముఖ హీరో, మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు ఒక వీడియో విడుదల చేశారు.
‘అందరికీ నమస్కారం… యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీకాదు అనే నిర్లక్ష్యం కానీ, ఈ రెండు పనికిరావు. జాగ్రత్తగా ఉండి కరోనా వైరస్ ను ధైర్యంగా ఎదుర్కొవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉదృతం తగ్గేవరకూ ఇంటికే పరిమితం కావడం ఉత్తమం’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ వీడియోలో ప్రజలు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చిరంజీవి తెలియజేశారు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశముందని చెప్పారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దామని, అదే ఉత్తమమని పేర్కొన్నారు.
ప్రజలు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మోచేతి వరకూ వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకన్లపాటు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
- తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ ను కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి.
- మీ చేతిని కళ్లకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి.
- అలాగే జ్వరం, జలుబు, దగ్గు, అలసటలాంటివి ఉంటే వెంటనే డాక్టరుని సంప్రదించండి.
- మీ జలుబు, దగ్గు ఇతరులకు వ్యాపించకుండా మీ ముఖానికి మాస్క్లు ధరించండి.