ఫిబ్రవరి 24, 2023 నాటికి రష్యా “ప్రత్యేక సైనిక చర్య”గా పేర్కొంటూ ఉక్రెయిన్పై దండెత్తి ఒక సంవత్సర కాలం గడవనుంది. కాగా ఈ సంవత్సర కాలంలో ఉక్రెయిన్లో భారీ శరణార్థుల సంక్షోభంతో పాటు, ప్రాణ నష్టం మరియు మౌలిక సదుపాయాల విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ను ఆకస్మికంగా సందర్శించారు. అలాగే యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి అదనంగా 500 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు. మరోవైపు యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఈరోజు పోలిష్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాను కలుస్తారని తెలిపారు. ఇక పోలండ్ చాలా పెద్ద సంఖ్యలో ఉక్రేనియన్ శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ పరిణామాలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంగళవారం రష్యన్ ఫెడరల్ అసెంబ్లీలో తన’స్టేట్ ఆఫ్ ది నేషన్ స్పీచ్’లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ‘రష్యన్ మిలిటరీ ఆపరేషన్’ను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ పాలనకు మద్దతు ఇస్తున్నందుకు పశ్చిమ దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యా చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటోందని, అయినప్పటికీ, రష్యా ఎలాంటి సవాళ్లకైనా ప్రతిస్పందిస్తుందని, యుద్ధభూమిలో రష్యాను ఓడించడం అసాధ్యం అని పుతిన్ నొక్కి చెప్పారు. ఇక వచ్చే ఏడాది నిష్పక్షపాతంగా అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తామని పుతిన్ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఒలిగార్చ్లు తమ డబ్బును పశ్చిమ దేశాలపై ఖర్చు చేయకుండా రష్యాలో పెట్టుబడులు పెట్టాలని పుతిన్ కోరారు. సైనికులే దేశానికి వెన్నెముక అని అభిప్రాయపడిన ఆయన, వారి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు పుతిన్ ప్రకటించారు.
ఇక ఉక్రెయిన్పై యుద్దానికి పశ్చిమ దేశాలే కారణమని, శాంతియుత విధానాల ద్వారా ‘డాన్బాస్’ సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలను రష్యా చేస్తోందని తెలిపారు. నాటో దళాలను పెంచుతూ, పశ్చిమ దేశాలు దుందుడుకు చర్యలకు దిగుతున్నాయని, స్థానిక సమస్యలను ప్రపంచ దేశ సమస్యగా మారుస్తున్నాయని మండిపడ్డారు. ఉక్రెయిన్ పాలకులు దేశ ప్రయోజనాలను కాపాడలేరని, వారు విదేశీ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక దేశం కోసం పోరాడుతున్న సైనికులు, వారి కుటుంబాలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని పుతిన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో అణు ఆయుధాల ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. కాగా వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మొదటిసారిగా 1991లో సంతకం చేయబడింది. అనంతరం 2010లో కొత్త ఒప్పందం ద్వారా సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను పరిమితం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE