ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మరియు ఎన్నికల కమిషనర్ల (ఈసీ)ల నియామకానికి సంబంధించిన ఎంపికపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా ఓ నూతన కమిటీని కూడా నియమించింది. ఇకపై ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించడానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ), భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)లు సభ్యులుగా త్రిసభ్య ప్యానెల్ను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు మరియు సీజేఐతో కూడిన కమిటీ నియామకాలపై నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజారిటీతో ఏకగ్రీవంగా తీర్పును ప్రకటించింది.
ఇక సుప్రీంకోర్టు జడ్జిలను నియమించడానికి కొలీజియం వ్యవస్థ ఉన్నట్లే ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా అలాంటి వ్యవస్థ ఉండాలని సుప్రీం అభిప్రాయపడింది. ఈ మేరకు భారత పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం.. ఈ విషయంలో చట్టం తీసుకొచ్చే వరకు ఈ కమిటీయే నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కాగా ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ను నియమించే ఫైల్ను కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఆఘమేఘాలపై అన్ని విభాగాల నుంచి అనుమతి పొందడంపై సుప్రీంకోర్టు ఇదివరకే కేంద్రాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కూడా కేంద్రాన్ని హెచ్చరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE