ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి మీడియాకు వివరించారు. ముఖ్యంగా సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద గ్రాంటు అందించడంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునే నిమిత్తం ఆర్థిక సాయం చేసే పథకానికి ప్రభుత్వం “గృహలక్ష్మి పథకం” గా పేరు నిర్ణయించిందని చెప్పారు గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించడమైనదని, ఒక్కొక్క నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇవే కాకుండా 43 వేల ఇండ్లు స్టేట్ కోటాలో పెట్టడం జరిగింది. మొత్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కేబినెట్ నిర్ణయిందన్నారు.
“ఒక్కొక్క ఇంటికి గ్రాంటుగా 3 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కొక్క దఫా 1 లక్ష రూపాయల చొప్పున మూడు దఫాలుగా 3 లక్షల రూపాయలను గ్రాంటుగా వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకానికి 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. మంజూరు చేసే ఇండ్లను మహిళ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు గృహనిర్మాణ సంస్థ ద్వారా పేద ప్రజలకు ఇండ్లు కట్టుకునేందుకు ఇచ్చిన 4 వేల కోట్ల రూపాయల అప్పులను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ కేబినెట్ ఇతర నిర్ణయాలు:
- రెండవ విడత గొర్రెల పంపిణీ: మొదటి దఫా గొర్రెల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 7,31,000 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగింది. ఇందులో 50 శాతం పంపిణీ గతంలోనే పూర్తయింది. మిగతా 50 శాతం గొర్రెల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం 4,463 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినేట్ తీర్మానించింది. ఈ పంపిణీ ప్రక్రియను ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగస్టు నెలలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరపాలని ఆదేశాలివ్వడం జరిగింది.
- పోడు భూముల పంపిణీ: రాష్ట్రంలో 4,00,903 ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రక్రియలన్నీ పూర్తయి ఈ పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ పంపిణీని వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. పోడు భూముల పంపిణీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
- ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రహావిష్కరణ: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రం నలుమూలనుంచి లక్షలాదిమంది దళిత బిడ్డలను హైద్రాబాద్ కు ఆహ్వనించి వారి సమక్షంలో ఆవిష్కరించాలని, ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది.
- జీవో 58, 59 పొడిగింపు: జీవో 58, 59 లకు సంబంధించి మిగిలిన లబ్దిదారుల విజ్జప్తి మేరకు చివరి అవకాశంగా దరఖాస్తు సమయాన్ని నెలరోజులకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు జీవో 58 ద్వారా 1,45,668 మందికి పట్టాలివ్వడం జరిగింది. జీవో 59 ద్వారా 42,000 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. కటాఫ్ తేది గతంలోని 2014 నుండి 2020 కి మారుస్తూ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో జీవో 58, 59 ద్వారా మిగతావారికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు పేదల ఇండ్లు కూల్చి, వాళ్ళ ఉసురు పోసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పట్టాలు తయారుచేసి వాళ్లకు అందిస్తున్నది.
- డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపాన్ని పనులు పూర్తయిన వెంటనే మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించడం జరుగుతుంది. సొంత జాగా ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకంతో పాటు, డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద ఇండ్ల నిర్మాణం, పంపిణీ జరుగుతూనే ఉంటుందని కేబినెట్ స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE