తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మీడియాకు వివరించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాల్లో రూ.50 కోట్లతో వసతిగృహాల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సనాతనధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటారు. కాశీలో మరణిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయని హిందువుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీ యాత్రకు విరివిగా భక్తులు వెళుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం అక్కడ వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. 60 వేల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు గాను రూ.25 కోట్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన చర్యల కోసం, కాశీలో స్థలం ఎంపిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించి రావాలని కేబినెట్ తీర్మానించింది.
అదే విధంగా శబరిమలలో తెలంగాణ భక్తుల సౌకర్యార్థం కోసం అక్కడ కూడా వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇందుకు గాను 25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ కి ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. తదనంతరం మంత్రుల బృందం వెళ్ళి అక్కడ పనులు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో సీఎం కేసీఆర్ కేరళ సీఎం పినరయి విజయన్ తో ఈ విషయంపై చర్చించారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE