బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా, బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలవకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు.
భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టీఎస్పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అబాసు పాలై, పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారు. అయినా బండి సంజయ్ కు బుద్ది రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా దాదాపు వందకు పైగా సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీలు జరిగాయని ఇందులో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందనన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై ఏమంటావని బండి సంజయ్ ని సూటిగా నిలదీశారు. మరి ఈ పేపర్ లీకేజీల పైన ప్రధానమంత్రి మోదీని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే, తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. అక్కడ పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ లేక అక్కడి ముఖ్యమంత్రిని కానీ ఏనాడు బీజేపీ బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. స్వయంగా బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసు అన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలా.. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమని అన్నారు.
ఎప్పుడైనా ఎక్కడైనా లోపం జరిగితే ప్రభుత్వం వెంటనే ఎంత వేగంగా స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకుందనేదే ముఖ్యమని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో సిట్ ను నియమించి.. బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇది బాధాకరమైన నిర్ణయం అయినప్పటికీ తప్పలేదని, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఒకవైపు ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోకుండా కేవలం మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
ప్రతిసారి తమ స్వార్ధ రాజకీయాలకు సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బీజేపీకి కొత్త కాదని, ఈ వ్యవహారాన్ని సైతం బీజేపీ శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్ర చేస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే, వారిని పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న బండి సంజయ్ కు అసలు యువత గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తే తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర యువత మర్చిపోలేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమీషన్ నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్ ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అన్నారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కేటిఆర్ ఆరోపించారు. ఇలా రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల రాష్ట్రంలోని యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE