తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ ఘటన తీవ్ర సంచలనం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన పరీక్షలు వాయిదా పడతాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దీనిపై స్పందించింది. పదో తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేయలేదని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెల్లడించారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిద్రండులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె సూచించారు. అయితే ఈ ఘటనలో పరీక్షా హాల్లోకి బయటి వ్యక్తులు రాలేదని, పరీక్ష సిబ్బంది ఎవరూ సెంటర్ను విడిచివెళ్లలేదని ఆమె వివరించారు.
ఈ క్రమంలో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బందెప్ప, ఫిజిక్స్ టీచర్ సమ్మప్పతో పాటు చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు తెలిపిన దేవసేన, వీరిపై యాక్ట్ 25/ 1997 ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించామని కూడా అన్నారు. కాగా పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమవగా.. తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. ఇక ఈ పరీక్షకు 99.6 శాతం మంది విద్యార్థులు హాజరవగా.. మొత్తం 4,87,050 మందికి గానూ 4,84,885 మంది హాజరయ్యారని, మరో 2,165 మంది గైర్హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఇక పరీక్షల నిర్వహణ సందర్భంగా సంబంధిత అధికారులకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE