ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉండగా తాజా లెక్కల మేరకు కరోనా బాధితుల సంఖ్యలో అమెరికా మొదటిస్థానంలో నిలిచింది. మార్చ్ 28, శుక్రవారం నాటికి అమెరికాలో 1,00,000 మందికి పైగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ కూడా లక్ష కేసులు నమోదు కాలేదు. అదే విధంగా 1700 మంది వైరస్ వలన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఎక్కువ మందికి చికిత్స అందించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో అమెరికా సైతం ఉద్దీపన పథకాల దిశగా అడుగులు వేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రజలకు ఊరట కలిగించేలా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన చట్టపరమైన దస్త్రంపై మార్చ్, 27 శుక్రవారం నాడు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ పథకం వలన అమెరికాలో ఒక్కో కుటుంబానికి దాదాపు 3,400 డాలర్లు అందే అవకాశముంది.