దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59 , ఆంధ్రప్రదేశ్ లో 13 నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వంతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు లేదా అనుమానితుల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులతో పాటుగా, ఇటీవల విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వారి ఇళ్లను కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. హోంశాఖ నుంచి వివరాల సేకరించి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసులు అధికారులతో పాటుగా, గ్రామాల్లో ఆరోగ్య శాఖల బృందాలు వారి ఇళ్లకు వెళ్తూ వివరాలను పూర్తీ వివరాలను సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి, హోంశాఖకు సంబంధించిన ఒక ముద్రను కూడా వారి చేతిపై వేస్తున్నారు. ఆ ముద్రలో వారు ఎంతకాలం హోమ్ క్వారంటైన్లో ఉండాలనే తేదీ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, ఆ ఇంటి ఫొటో, ఇతర అన్ని రకాల సమాచారాన్ని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అనంతరం ఈ జియో ట్యాగ్గింగ్ ద్వారా వారిని ప్రభుత్వం పర్యవేక్షనుంది.