తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని, 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడు ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు 1500 మంది ప్రతినిధులుతో సమావేశం నిర్వహిస్తామని, 15న పలు కీలక తీర్మానాలు చేస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈనెల 28న మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారని తెలియజేశారు.
వైసీపీ పాలనపై ప్రత్యేక తీర్మానం ఉంటుందని, 28న జరిగే కార్యక్రమానికి దాదాపు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడుకు గతంలో వలే వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని, అయితే పోలీస్ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా మహానాడు నిర్వహణ కోసం 15 కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత నేతలు, కార్యకర్తలపైనే ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రులు జవహర్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు, అయ్యన్న పాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE