కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మంగళవారం నాడు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, దీంతో ఈ నెలలో సగం వేతనం చెల్లించి, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం వైఎస్ జగన్ వివరించినట్టు సూర్యనారాయణ తెలిపారు. కరోనా వలన ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతోనే రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్క నెలకు మాత్రమే ఈ విధంగా రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగుల మద్దతు ఉంటుందని, కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరిస్తామని ఆయన చెప్పారు.
[subscribe]