తెలంగాణ ఎన్నికలు ఇక కీలక దశకు చేరుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుండటంతో పాటు.. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుండటంతో అభ్యర్ధుల్లో టెన్షన్ షురూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. నేటి తుది దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అగ్రనేతలంతా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు అభ్యర్దులందిరిలోనూ మరో కొత్త టెన్షన్ మొదలైంది. నవంబర్ 30న అంటే.. పోలింగ్ రోజు ఓటింగ్ కోసం అందరికీ శెలవు ప్రకటించారు. మధ్యలో ఒక్క రోజు శెలవు తీసుకుంటే మరో రెండు రోజుల పాటు వస్తున్న శెలవులతో లాంగ్ వీకెండ్ వస్తుంది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. అభ్యర్దులు కూడా తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రతీ ఓటర్ యొక్క ఓటు పోల్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా తలపడుతున్నాయి. ప్రతీ సీటు.. ప్రతీ ఓటు అభ్యర్థి జాతకాన్ని నిర్ణయించే స్థాయికి చేరుకుంది.
ఇదే సమయంలో కొత్త సమస్య అభ్యర్దులను వెంటాడుతోంది. పోలింగ్ జరిగే నవంబర్ 30న ..ఓటు వేయడానికి సెలవు ప్రకటించారు. ఆ తరువాత రోజు శుక్రవారం వర్కింగ్ డే ఉన్నా.. శనివారం, ఆదివారం హైదరాబాద్ పరిధిలోని ఐటీతో పాటు కొన్ని ప్రయివేటు కంపెనీలకు చాలా వరకు హాలీడే ఉంటుంది. దీనికి తోడు కార్తీక మాసం కావటంతో కుటుంబాలతో సహా పిక్నిక్ స్పాట్లకు వెళ్లడం చాలామందికి అలవాటు. ఇప్పుడు వస్తున్న వరుస సెలవులతో ఓటర్లు పోలింగ్ రోజు ఓటింగ్ కేంద్రాలకు వస్తారా లేకపోతే లాంగ్ వీకెండ్ కదా అని టూర్లకు ప్లాన్ చేస్తారా అనే టెన్షన్ అభ్యర్దుల్లో నెలకొంది.
ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు వర్క్ చేస్తున్నారు. ఇందులో కొంతమందికి ఇక్కడ ఓటు హక్కు లేదు. పక్క రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల నుంచి వచ్చిన వారు చాలామంది హైదరాబాద్లోనే ఉండటంతో.. ఎన్నికల సమయంలో వారి సొంత ప్రాంతాల్లోనే ఇప్పటికీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారయితే..వారి ఓటు హక్కు కోసం వారి సొంత గ్రామాలకు వెళ్లిపోతారు.
ఇలా హైదరాబాద్లో ఉంటూ ఓటు కోసం సొంతూళ్లకు వెళ్లేవారు 30-40 శాతం మంది ఉన్నారు. హైదరాబాద్లోని చాలా నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉంటుంది. వీరితో పాటూ వీరి ఓట్లు వీరి కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తాయి. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. వీరి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ సారి దీనికి లాంగ్ వీకెండ్ తోడవడంతో.. వీరంతా పోలింగ్కు దూరంగా ఉంటే ఏం జరుగుతుందనే అనుమానాలు అభ్యర్థులలో తలెత్తుతున్నాయి.
కార్తీక మాసం కావటంలో కుటుంబంతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చుట్టాలతో కలిసి వన భోజనాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వరుస సెలవులు రావడంతో.. ఇలాంటి టూర్లు ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలియడంతో ఇప్పుడు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీనికి తోడు హైదరాబాద్లో ఉంటున్న ఉద్యోగులపైన అన్ని పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య..హోరాహోరీ పోరు సాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతీ ఓటు కీలకమే కానుంది. ఏ పార్టీ గెలిచినా కూడా స్వల్ప మెజార్టీనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తమకు అనుకూలంగా ఉన్న ప్రతీ ఓటు పోల్ అయ్యేలా.. అభ్యర్దులంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఈ వరుస శెలవుల వల్ల..పోలింగ్ శాతం తగ్గితే తమ పరిస్థితి ఎలా మారుతుందోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE