తెలంగాణ ఎన్నికల సమరం ఉత్కంఠగా మారుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే త్రిముఖ పోటీ కనిపించగా.. చాలా చోట్ల కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్యే పోటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఈసారి తమకు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని చెబుతూ వస్తోంది. మరోవైపు బీజేపీ అగ్రనాయకులంతా దాదాపు తెలంగాణలోనే ఉంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
తెలంగాణలో తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ రెండు పార్టీలు రాజకీయ కురుక్షేత్రంలో హోరా హరీగా తలపడుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ తమ హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతూ ప్రచారం చేస్తోంది.అటు క్షేత్ర స్థాయిలో తమకు అనుకూలంగా ఉందని 80 సీట్లు ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో తాము మూడో స్థానంలో ఉన్నామని..కాస్త గట్టిపోటీ ఇస్తే చాలు కొన్ని సీట్లు ఈజీగా సొంతం చేసుకుంటామని బీజేపీ భావిస్తోంది. దీంతో ఇప్పుడు అధికారం దక్కించుకోవాల్సిన పార్టీల మ్యాజిక్ ఫిగర్ గురించి..కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడూ ప్రత్యేకమైనదే. తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో 6 నుంచి 7 స్థానాలు ఎంఐఎం గెలుచుకుంటుందనేది ఎప్పటి నుంచో వస్తోంది. ఈ సారి కూడా ఇదే జరగొచ్చనే అంచనాలున్నాయి. ఇక, 112 స్థానాలు ఉన్నాయనుకుంటే.. అధికారం దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా కూడా 60 స్థానాలు కచ్చితంగా దక్కాలి. దీంతో ఇప్పుడు జరుగుతున్న హోరా హోరీ పోరులో ప్రతీ సీటు కీలకం కానుండటంతో నేతలంతా ఎలా అయినా గెలుపును సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఇస్తున్న బీజేపీకి వచ్చే సీట్లు..పోలయ్యే ఓట్లు ఇప్పుడు డిసైడిండ్ ఫ్యాక్టర్గా మారనున్నాయి. తాజాగా అందుతున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 30 స్థానాల్లో బీజేపీ ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం లేదా ప్రత్యర్ధి పార్టీల గెలుపు, ఓటమలను ప్రభావితం చేయనుందని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే అక్కడ బీజేపీకి వచ్చే ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోలయ్యేవే అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కాంగ్రెస్కు పడే ఓట్లను బీజేపీ తమ వైపు తిప్పుకోలేకపోయిందని.. రెండు పార్టీల ఓటర్లు వేర్వేరు అనేది వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ ప్రధాన హామీ అయిన.. బీసీ సీఎం నినాదం..ఎస్సీ వర్గీకరణ అంశాలు ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేస్తాయోనన్నది చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
దీంతో ఈ ఎన్నికలలో బీజేపీ కీలకంగా మారనుందన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది. తెలంగాణలో తొలి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రతీ సభలో చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోతే.. తమకు వచ్చే సీట్లే కీలకం అవుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం ఎట్టి పరిస్థితులలోనూ లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ మద్దతు నిజంగా అవసరమైతే.. మాత్రం అప్పుడు తెలంగాణ రాజకీయాలలో కీలక టర్న్ తీసుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్కు అవసరమైతే ఎంఐఎం మద్దతు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం హంగ్కు అవకాశమే లేదని అంటున్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలనతో విసిగిపోయారని..ఇప్పుడు తమకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని ధీమాగా చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE