అసెంబ్లీ ఎన్నికలవేళ రైతుబంధు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. తెలంగాణ రాజకీయాలన్నీ రైతుబంధు చుట్టే తిరుగుతున్నాయి. రైతుబంధు వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలకు, ప్రతివిమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు బురదజల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమయినప్పటికీ రైతుబంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం నిరాశే ఎదురయింది.
రైతుబంధు పథకంలో భాగంగా రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రైతుబంధు నిధులు పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే ఎన్నికల సంఘం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఉపసంహరించుకుంది. బీఆర్ఎస్ నేతలు నియమావళిని ఉల్లంఘించారని.. అందుకే అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
ముందు రైతు బంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత అనుమతి వెనక్కి తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో రైతుల నుంచి లబ్ధి పొందాలనుకున్న బీఆర్ఎస్కు షాక్ తగిలిందని అంటున్నారు. అటు కాంగ్రెస్ నేతలే రైతుబంధు నిధుల పంపిణీని ఆపించారని.. వారు ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ అనుమతిని ఉపసంహరించుకుందని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. వచ్చిన వెంటనే రైతుబంధు నిధులను పంపిణీ చేస్తామని రైతులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
అటు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్పై రివర్స్ అటాక్ చేస్తోంది. మంత్రి హరీష్ రావు నోటి దురుసు వల్లే ఈసీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ను గద్దె దించి డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని అంటున్నారు. అయితే అటు రైతులు మాత్రం అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో.. తీవ్ర నిరాశతో ఉన్నారు. మరి ఈ వ్యవహారం ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..? రైతులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE