ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రావాలని సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జెండాను ఎత్తింది నిజామాబాద్ జిల్లా అని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు రూ. 50 కోట్ల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. ఇక్కడి ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా ప్రత్యేకంగా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఆయన తండ్రిని చూసి ఆగుతున్నామని, లేకుంటే బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించేవాళ్లమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి కడుతున్న పన్నుల్లో 46 శాతం మాత్రమే తిరిగి వస్తున్నాయని, ఒకవేళ ఇది తప్పని నిరూపిస్తే రాజీనామాకు కూడా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని, మాటలేమో ‘సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ కుచ్ బక్వాస్’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు సరిహద్దు వివాదంతో నిత్యం ఘర్షణలు పడుతున్నాయని, మళ్ళీ అక్కడ అధికారంలో ఉన్నది రెండూ బీజేపీ ప్రభుత్వాలేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల మధ్య చిన్న సమస్యను పరిష్కరించలేని ప్రధాని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారని బీజేపీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఇక ఫిబ్రవరి ఒకటిన పెట్టే బడ్జెట్.. మోదీ సర్కార్ కు చివరి బడ్జెట్ అని, తెలంగాణ బీజేపీ నేతలు కనీసం ఇప్పటికైనా మేలుకుని రాష్ట్రానికి నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని, మీకు నిజంగా దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రావాలని, అందరం కలిసే ఎన్నికలకు పోదామని మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE