అసెంబ్లీ ఎన్నికలవేళ తెలంగాణలో హాట్.. హాట్ వెదర్ కనిపిస్తోంది. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక.. మూడోసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ 2014, 2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈసారి మరింత రసవత్తరంగా సాగుతున్నాయి రాజకీయాలు. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా తెలంగాణ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈసారే ఎందుకింత ఉత్కంఠకరంగా మారాయి తెలంగాణ ఎన్నికలు అనేది చర్చనీయాంశంగా మారింది.
అందరికంటే ముందే ఎన్నికల శంఖారావం పూరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రత్యర్థులతో పోల్చుకుంటే.. ప్రచారంలో ఓ అడుగు ముందుగానే దూసుకెళ్లారు. కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామన్నట్లు ఎంట్రీ ఇచ్చాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఒక్కసారిగా ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఢిల్లీ పెద్దలు తెలంగాణలో వాలిపోయారు. క్షణం తీరిక లేకుండా ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తించారు.
జాతీయ పార్టీలు తెలంగాణ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరి నిమిషంలో దిగ్గజ నేతలు రంగంలోకి దిగి దుమ్ములేపారు. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ పీయూష్ గోయెల్, యోగి ఆదిత్యానాథ్ వంటి నేతలు ప్రచారం నిర్వహించారు. అటు కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి దిగ్గజ నేతలు ప్రచారం చేశారు. తెలంగాణలో జెండా పాతడమే లక్ష్యంగా ముందుకు కదిలారు.
అయితే మొన్నటి వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి అంతంత మాత్రంగానే ఉండేది. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్లో కొత్త జోష్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేంతలా పుంజుకుంది. ఏపీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకోవాలంటే.. తెలంగాణలో పట్టం కట్టాల్సిందేనని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. అందుకే తెలంగాణపై అంతలా ఫోకస్ పెంచింది. తెలంగాణ ఇచ్చింది తామేననే సెంటిమెంట్ బాణాన్ని వదులుతూ.. ముందుకు కదలింది.
అటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదు. మొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఆ అధికారాన్ని కూడా కోల్పోయింది. అందుకే ఎలాగైనా తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ వ్యూహం రచించింది. ఇక్కడ గెలుపొందడం ద్వారా.. ఏపీ, తమిళనాడులో పార్టీ పుంజుకుంటుందని నేతలు భావించారు. అందుకే అగ్రనేతలు రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు దిగితే.. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ వంటి నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి హోరెత్తించారు. చివరికి ప్రజలు ఎవరికి పట్టం కడుతారనేది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ