ధనం మూలం ఇదత్ జగత్ అనేది సత్యమో.. ఎన్నికల సమయంలో చూస్తే అర్ధం అవుతుంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకూ డబ్బు ప్రవాహం పారాల్సిందే. మామూలుగా ఎన్నికలు అంటేనే ఖర్చు. ప్రచారాల నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునేవరకూ డబ్బు లేనిదే పని జరగదు. అందులోనూ ప్రతీ ప్రతీ అభ్యర్థిలో తామే గెలవాలని బలంగా కోరుకోవడంతో డబ్బెంత ఖర్చయినా పర్వాలేదు..ఎన్నికలలో మాత్రం గెలిచి తీరాల్సిందేనన్న పంతం పెరుగుతుంది.
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో డబ్బులు ఏరులై పారుతుందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రచార పర్వం ముగిసిపోవడంతో..ప్రలోభపర్వానికి తెర లేపిన నేతలు ..ఎంత ఖర్చుకయినా వెనుకాడటం లేదు. మరోవైపు ఎన్నికలలో ప్రలోభాలకు చెక్ పెట్టడానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచీ రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం..అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది.
ఈసీ నియమావళి ప్రకారం పోటీలో నిలిచిన అభ్యర్థులు..ఈ నిబంధనలు అనుసరించి వ్యయపరిమితిని గరిష్టంగా రూ. 40 లక్షలుగా నిర్ణయించింది ఈసీ. అయితే ఈ వ్యయ పరిమితి 1952 వ సంవత్సరంలో రూ. లక్ష మాత్రమే ఉండగా ఇప్పుడు రూ.40 లక్షలకు చేరిపోయింది. అయితే ఎన్నికల కమిషన్కు అఫీషియల్గా ఈ ఖర్చును చూపించినా ఒక్కో అభ్యర్ధి మాత్రం తన గెలుపు కోసం కోట్లలో ఖర్చు పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
1952 వ సంవత్సరంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో.. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తంలోనే అప్పట్లో అభ్యర్థులు ఖర్చు చేసేవారు. అప్పుడు ఇప్పటిలా మద్యం ఖర్చు, డబ్బుల పంపిణీ, ఇతర బహుమతుల ఖర్చు ఉండేది కాదు. దీంతో అప్పుడు రూ.లక్ష భారీగానే అనిపించింది. కానీ పదేళ్ల తర్వాత అంటే 1962 నాటికి ఎన్నిలక వ్యయ పరిమితి రూ.3లక్షలకు పెరిగింది.
అలాగే 1971లో జరిగిన ఎన్నికల్లో రూ.4 లక్షలకు చేరుకోగా .. 1975 నాటికి ఆ ఖర్చు రూ.5 లక్షలు చేరింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.10 లక్షలకు చేరగా, 1991లో జరిగిన ఎన్నికల ఖర్చును రూ.12 లక్షలకు పెంచారు. అలాగే 1999లో జరిగిన ఎన్నికల కోసం రూ.15 లక్షలు.. 2004 నాటికి రూ.17 లక్షలకు పెరిగింది. ఇక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు రూ.26 లక్షలకు చేరగా, 2014లో జరిగిన ఎన్నికల కోసం రూ.28 లక్షల వ్యయపరిమితిగా నిర్ణయించారు. 2018లో జరిగిన ఎన్నికల కోసం వ్యయపరిమితి రూ.35 లక్షలకు చేరగా.. ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు రూ.40 లక్షలకు పెంచారు.
నిజానికి గడిచిన మూడు ఎన్నికలలో అభ్యర్ధులు పెట్టిన ఖర్చును గమనిస్తే.. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి కంటే కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్న ఎన్నికల ఖర్చు..దేశంలోని ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ లేదని ఈసీ కూడా గుర్తించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కంపేర్ చేసి చూసినప్పుడు తెలంగాణలో రూ. 600 కోట్లకు పైగా పట్టుపడడం ఇందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలలో గెలవాలంటే రూ.50 కోట్లు ఖర్చు చేయక తప్పదనే పరిస్థితి కనిపించడంతో ప్రతీ అభ్యర్ధీ దీనికి సిద్ధపడే బరిలో దిగుతున్నారు. అటు బాగా ఖర్చు పెడతారన్న నమ్మకం ఉన్నవాళ్లకే అన్ని పార్టీలు తమ అభ్యర్థులుగా సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ