ఎటువంటి అంచనాలకు అందకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మిగిలిన కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫోకస్ అంతా ఏపీపై పెట్టడానికి కాంగ్రెస్ హై కమాండ్ రెడీ అవుతుంది. ఇప్పటికే దీనిపై ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఓటమి ఎదురైతేనే.. కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలయినా, కేడర్ అయినా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే. వీళ్లంతా ఏపీలో కాంగ్రెస్ స్ట్రాంగ్ అయితే మళ్లీ సొంతగూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆధిపత్య ధోరణితో విసిగిపోయిన చాలామంది నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వేరే గత్యంతరం లేక వైసీపీలో కొనసాగుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ ఆటోమేటిక్గానే బలోపేతం అవుతుందని అధిష్టానం భావిస్తోంది.
సుదీర్ఘకాలం పాటు పదవులు అనుభవించిన వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చాలా మందే ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన నచ్చని ఏపీ వాసుల ఆగ్రహానికి గురైంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు మాత్రమే న్యాయం జరిగిందని..ఏపీ అన్యాయం అయిందన్న భావన ఏపీలో పెరిగిపోవడంతో.. అక్కడ ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులంతా గత్యంతరం లేక వైసీపీ బాట పట్టారు. కానీ వైఎస్సార్సీపీకి వెళ్లిన నేతలు ఏమంత సంతృప్తికరంగా లేరన్నది బహిరంగ రహస్యం.
సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ 2019 ఎన్నికలకు ముందు మాత్రమే వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతవరకూ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలోపేతం అవుతుందని ఎదురు చూశారు. కానీ అలాంటి ఛాయలు కనిపించకపోవడంతో.. ఆయన వైసీపీలో ఆలస్యంగా చేరారు. ఇప్పుడున్న చాలామంది సీనియర్లకు జగన్ అన్నా..ఆయన వైఖరి అన్నా మింగుడు పడడం లేదు. కానీ ప్రత్యామ్నాయ పార్టీ లేక అందులోనే కక్కలేక మింగలేక అవకాశం కోసం ఎదురుచూస్తూ పార్టీలోనే ఉండిపోతున్నారు.
ఏపీలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే మాత్రం.. వైసీపీలో కీలక నేతలు చాలామంది యూటర్న్ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఏపీపైనే ఫుల్ ఫోకస్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారని గట్టిగా వార్తలు వినిపించాయి.
దీనికి తగినట్లే పార్టీ హై కమాండ్తోనూ షర్మిల నేరుగా చర్చలు కూడా జరిపారు. కానీ చివరకు కాంగ్రెస్లో చేరకుండా.. ఎన్నికల్లో కాంగ్రెస్కు బాహటంగా మద్దతు మాత్రమే ప్రకటించారు.ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధించడంతో..వైఎస్ షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆమె కనుక ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే ఏపీ బాధ్యతలను పూర్తిగా షర్మిలకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో చాప కింద నీరులా..తెలంగాణలో జరిగినట్లే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా బలోపేతం అవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
2024 మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మాత్రం.. ఆ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలు, సీనియర్లు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టే అవకాశాలున్నాయి. అంతేకాదు వైసీపీ అసంతృప్త జాబితాలో కొందరు మంత్రులు కూడా ఉన్నారన్న వార్తలు కూడా ఆమధ్య గట్టిగా వినిపించాయి. ప్రస్తుతం జగన్ ఏకపక్ష నిర్ణయాలతో, సీనియర్లతో ఆయన ప్రవర్తించే తీరుతో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. వారంతా తగిన ప్రత్యామ్నాయం లేక అక్కడే ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపువైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా.. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే. అంతేకాదు నేటికి కూడా కాంగ్రెస్ భావజాలంతో ఉన్నవాళ్లే కనిపిస్తారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిన మరుక్షణం వారంతా సొంత గూటికి జంప్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి లెక్కలతోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఇప్పటి నుంచే గాడిలో పెడితే.. 2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని.. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనికి తోడు తమ నమ్మకాన్ని తెలంగాణ ఎన్నికలు నిలబెట్టడంతో ఇదే జోష్ను ఏపీలోనూ కంటెన్యూ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం రెడీ అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE