లోక్ సభ సమరానికి గడువు సమీపిస్తుండడంతో.. అధికార, విపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కుల, మత, వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలను ప్రారంభించాయి. ఇప్పటికే పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ.. మరోసారి కూడా పగ్గాలు చేపట్టేందుకు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. తమ పార్టీ హిందూత్వ ఎజెండానే మరోసారి నమ్ముకుని ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో అయోధ్య రాముడు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొద్ది కాలంగా బీజేపీ నేతలు అందరూ అయోధ్య మంత్రాన్నే జపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందే అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకంతో ఆ పార్టీ మైలేజీ మరింత పెరుగుతుంది అనడంలో అతిశయోక్తి కాదు.
విగ్రహ ప్రాణప్రతిష్ఠతకు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆహ్వానాలు పంపింది. కాంగ్రెస్ కీలక నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. తాము వెళ్లేది లేదని, మత ప్రాదికన బీజేపీ చేస్తున్న ప్రచారంగా చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఎవరు ఏమి అనుకున్నా మోడీ మాత్రం రాముడి విగ్రహ ప్రతిష్ఠకు త్రికరణ శుద్ధితో పని చేస్తున్నారు. ‘‘ఇంతటి భావోద్వేగానికి లోనవడం ఇదే మొదటిసారి. నా జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నాను’’ అంటూ ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే ప్రధాన కార్యక్రమానికి సన్నాహంగా శుక్రవారం నాసిక్లో ఆయన కొన్ని ధార్మిక క్రియల్లో పాల్గొన్నారు. నాసిక్లోని పంచవటికి శ్రీరాముని జీవితంలో కీలక ప్రాధాన్యత ఉంది. సీతాసమేతంగా ఇక్కడ కొంతకాలం శ్రీరాముడు వనవాసం చేశారని పురణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాసిక్లోని శ్రీ కాలారామ్ మందిర్ను ప్రధాని దర్శించుకున్నారు. రామాయణ పారాయణం చేశారు. రానున్న 11 రోజులు తాను అనుష్ఠాన దీక్ష చేపడతానని వెల్లడించారు. అనుష్ఠాన సమయంలో మోదీ కటిక నేలపై నిద్రిస్తారు. సూర్యోదయానికి ముందే మేల్కొని భగవంతుని పూజలు చేస్తారు. జపం ఆచరిస్తారు. సాత్విక ఆహారం తీసుకుంటారు.
అయితే.. కాంగ్రెస్ ఇందుకు విరుద్ధంగా ప్రచారం సాగిస్తోంది. సమస్యల పరిష్కారం ముఖ్యమా? మతం పేరుతో మోసపోవడం ముఖ్యమా? అని ప్రజల్లో చర్చకు పెడతామని సీనియర్ నేతలు చెబుతున్నారు. మత ప్రాతిపదికన ఓటు వేసే పరిస్థితులు దేశంలో పూర్తిగా లేవని విశ్లేషించారు. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతాచోట్ల హిందూత్వ పేరుతో బీజేపీకి ప్రయోజనం లభించే అవకాశాలు తక్కువేనని చెప్పారు. హిందూత్వ బీజేపీ సొత్తు కాదని కూడా ప్రచారం చేస్తామని అంటున్నారు. ఇదిలాఉండగా.. ఇప్పుడు కొత్తగా మహాత్మగాంధీకి తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 22వ తేదీన (అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠరోజున అందరూ మహాత్మా గాంధీ మాటలను ప్రతి ఇంట్లో గుర్తు చేసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. రాముడి గుడికి రాజీవ్ హయాంలోనే ఫౌండేషన్ వేశామని.. కోర్టు కేసుల కారణంగా కట్టలేదని మల్లు రవి చెప్పారు.
కాంగ్రెస్ డీఎన్ఏ లోనే రాముడి సందేశం ఉందని చెబుతూనే, మహాత్ముడి పేరు లేవనెత్తుతున్నారు. . మహాత్మా గాంధీ ఏం చెప్పారో ఒక్కసారి ఆలోచన చేయాలని అంటున్నారు. ‘రఘుపతి రాఘవ రాజారామ్ పతీత పావన సీతారాం’ అని గాంధీ చెప్పిన విషయం గుర్తుచేస్తున్నామన్నారు. భద్రాచలంలో ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బేగంబజార్లో మొన్న తాము ఏపీ డిప్యూటీ సీఎంపై చేసిన ఫిర్యాదుకు ఎఫ్ ఐఆర్ నమోదైందని అన్నారు. 22న రోజు దేశ ప్రజలందరూ తల మీద అక్షింతలు వేసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా రాముడి అక్షింతల పేరిట ఇప్పటికే పంపిణీ చేశారు. రామజపం చేయాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో కొందరు మాత్రం అదే రోజున మహాత్మగాంధీ మాటలను గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. బీజేపీ రామ జపం చేస్తుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా మహాత్ముడిని తెరపైకి తేవడం ఆసక్తిగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE