కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్ బుధవారం సూర్యపేటలో పర్యటిస్తున్నారు. సూర్యాపేటలో అత్యధిక కరోనా కేసులు నమోదైన ప్రాంతమైన సూర్యాపేట కూరగాయాల మార్కెట్ను సందర్శించారు. కంటైన్మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశీలించారు. కరోనా నివారణకు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కరోనా నివారణపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలోని హాట్స్పాట్ ప్రాంతాల్లో కూడా సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పర్యటించనున్నారు.
మరోవైపు సూర్యాపేట డీఎంహెచ్వో నిరంజన్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కూడా సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిరంజన్ స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్వో సాంబశివరావును నూతన డీఎంహెచ్వోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. సూర్యాపేట జిల్లాలో ఏప్రిల్ 21, మంగళవారం నాటికే 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu