ఎన్నికలవేళ రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు సాధారణమే. ఎన్నికలొస్తే చాలు పెద్ద ఎత్తున నేతలు పార్టీలు మారిపోతుంటారు. టికెట్ దక్కలేదని కొందరు.. అనుకున్న చోట టికెట్ ఇవ్వలేదని కొందరు.. ఇతర కారణాలతో మరికొందరు పార్టీలు మారుతుంటారు. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయించారు. ఇటీవల హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా కారు దిగి.. కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరడంపై కేడర్ భగ్గుమంటోంది. సైదిరెడ్డి వ్యవహారంతో హుజూర్నగర్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
తనకు బీజేపీలో చేరడం ఇష్టం లేదని.. బలవంతంగా కాషాయపు కండువా కప్పుకున్నానని సైదిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించడం కాక రేపుతోంది. ఇటీవల కార్యకర్తలతో సైదిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అందుకు సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదని.. బీజేపీ పుంజుకుంటోందని సైదిరెడ్డి చెప్పుకొచ్చారు. చెప్పకుండా బీజేపీలో చేరడం తప్పేనని.. అందుకు తనను క్షమించాలని సైదిరెడ్డి కార్యకర్తలను కోరారు. కార్యకర్తలంతా తన వెంటే ఉంటారన్న నమ్మకంతోనే బీజేపీలోకి వెళ్లానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కార్యకర్తలతో చర్చించాక పార్టీలో చేరుతానని చెప్పినప్పటికీ.. బీజేపీ పెద్దలు వినిపించుకోలేదని.. కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. అందుకే బీజేపీలో చేరానని సైదిరెడ్డి చెప్పుకొచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరానని అన్నారు. కార్యకర్తలంతా తనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. తాను బీఆర్ఎస్లో చేరినప్పుడు ఒక్క సర్పంచ్ కూడా లేరని.. ఆ తర్వాతే 120 మంది సర్పంచ్లను, 17 మంది పీఏసీఎస్లను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గెలిపించుకున్నామని అన్నారు. యువతకు ఏమీ చేయలేదనే బాధ తనలో ఉందని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని.. తద్వారా యూత్కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు తీసుకురావొచ్చని ఆలోచించానని సైదిరెడ్డి పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఇంతటి క్లీన్ ఇమేజ్ ఉన్న మోడీలాంటి నాయకుడు ఎవరూ లేవరని.. ప్రధానిపై సైదిరెడ్డి ప్రశంసలు కురిపించారు. మోడీకి అసలు కుటుంబమే లేదని.. దేశమే ఆయన కుటుంబమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించాలని కాంగ్రెస్ వాళ్లే కోరుకుంటున్నారని సైదిరెడ్డి బాంబు పేల్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితిల్లో 10 నుంచి 12 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అన్నారు. బీజేపీ పెద్దలు కూడా పార్లమెంట్ టికెట్ తనకు ఇస్తామన్నారని.. ఇప్పుడు పార్టీ మారకపోతే ముందు ముందు ఆగమవుతమని భావించి బీజేపీలో చేరానని సైదిరెడ్డి చెప్పుకొచ్చారు.
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ కనుమరుగైపోయిందని.. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదని సైదిరెడ్డి అన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా బీజేపీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. చెప్పకుండా పార్టీ మారడం తప్పేనని.. తనను క్షమించాలని కార్యకర్తలను సైదిరెడ్డి కోరారు. రెండు, మూడు రోజుల్లో హుజూర్నగర్ వచ్చి కార్యకర్తలతో సమావేశమవుతానని సైడిరెడ్డి చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY