ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలుతో కూడా ఆయన బాధపడినట్టు తెలుస్తుంది. మాతంగి నర్సయ్య సతీమణి జోజమ్మ కూడా వారం రోజుల క్రితం మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరీంనగర్ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983 లో ఇండిపెండెంట్ గా, 1999 లో టీడీపీ తరపున మాతంగి నర్సయ్య ఎమ్మెల్యే గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా కూడా మాతంగి నర్సయ్య బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, కొంతకాలం నుంచి వర్తమాన రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. మాతంగి నర్సయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu