చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే ప్రకటించారు. కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో పాత వారినే బరిలోకి దింపుతున్నారు. ఇక తిరుపతి జిల్లాలో గూడూరు పాశం సునీల్ కుమార్ ..సూళ్లూరుపేటలో అనూహ్యంగా నిలబడ్డ విజయశ్రీ అనే కొత్త అభ్యర్థిని పోటీకి పంపుతున్నారు.
శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, వెంకటగిరి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటికే తామే అభ్యర్థులమంటూ శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ నాయుడు కూడా అదే జోరులో ప్రచారం చేస్తున్నారు. తిరుపతి స్థానానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సీనియర్ నాయకులు నరసింహ యాదవ్, ఊక విజయ కుమార్, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, జేబీ శ్రీనివాస్లు పోటీ పడుతున్నారు.
అయితే ఇక్కడ జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తమకు ఆ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే కొణిదెల నాగబాబు, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ పోటీ పడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే పులివర్తి నాని నియోజకవర్గంలో గడప గడపకు తెగ తిరిగేసారు. అటు పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి కూడా తన భర్త తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పులివర్తి నాని, డాలర్ దివాకర్ రెడ్డి, బడి సుధా యాదవులు కూడా ప్రచారాలలో బిజీ అయిపోయారు. కానీ మొదటి జాబితాలో అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.
సత్యవేడులో కూడా ముగ్గురు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు డాక్టర్ హెలెన్, 2019లో పోటీ చేసి ఓడిపోయిన జెడ్డా రాజశేఖర్, ఇటీవల తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ సీటు ఆశిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో.. ఇప్పటికే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల బీసీవైపీ పార్టీ స్థాపించిన రామచంద్ర యాదవ్ కూడా పొత్తులో భాగంగా టికెట్ ఆశిస్తున్నారు.
ఇక పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ మురళీ మోహన్ తన ప్రచార వేగాన్ని పెంచి దూసుకుపోతున్నారు. పూతలపట్టు బహిరంగ సభలో కూడా డాక్టర్ మురళీమోహన్ని ఆశీర్వదించాలని స్వయంగా చంద్రబాబు ప్రకటించడంతో టికెట్ ఆయనకే అని మురళీ మోహన్ తో పాటు అంతా అనుకున్నారు.కానీ మొదటి జాబితాలో మురళి పేరు రాకపోవడంతో అతని వర్గీయులలో టెన్షన్ నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE