ఆంధ్రప్రదేశ్లో మందు బాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్న నూతన లిక్కర్ పాలసీపై .. ఏపీ ప్రభుత్వం బుధవారం కేబినేట్లో ఆమోదం తెలుపుతూ నిర్ణయాన్ని తీసుకుంది. నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపడంతో..అక్టోబరు మొదటి వారం నుంచి ఈ నూతన మద్యం పాలసీ అమలుకు చర్యలు తీసుకుంటారు. మద్యం ధరలు, రిటైల్ బిజినెస్, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను.. ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం – 1993కు కూడా తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నూతన మద్యం పాలసీలో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా.. మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని కేబినేట్లో ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నూతన విధానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుందని దీని ద్వారా… రిటైలర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్లో తాజా మద్యం ధరల ప్రకారం చూస్తే ..కేంద్ర పాలిత ప్రాంతం, పర్యాటక ప్రాంతం అయిన గోవా కంటే కూడా ఏపీలోనే మద్యం చీప్ అనేది స్పష్టమవుతుంది. గోవాలో మద్యం మినిమం ధర 100 రూపాయలు ఉండగా.. ఏపీలో 99 రూపాయలే. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. గోవా కంటే కూడా ఏపీలో మద్యం తక్కువ కావడం పట్ల మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాల మద్యం కోసం ఎదురు చూశామని ఇప్పుడు ఏపీలో అన్ని బ్రాండెండ్ మద్యం దొరకడంతో పాటు..నాణ్యమైన మద్యం అందుబాటులో రానుండటటం సంతోషంగా ఉందంటున్నారు.
తక్కువ ధరకే నాణ్యమైన కొన్ని రకాల మధ్యాలను అందుబాటులోకి తీసుకురావాలని అలాగే..దానికి అనుగుణంగా చర్యలను చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కేబినేట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండటానికి లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు పద్దతిని అనుసరిస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొంది.