ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చారిత్రకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం దిశ బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటనతో చలించిపోయిన సీఎం వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ చట్టం ద్వారా మహిళలపై జరిగే దారుణాలపై 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షపడేలా చేస్తామని, అందుకోసం ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసమే ఈ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నేరాల శాతం ఎక్కువగా ఉండేదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యిందని, నేరాలు అరికట్టేందుకు తీవ్రమైన చర్యలు చేపడతామని చెప్పారు. సమాజంలో మహిళలు, పిల్లలపై రోజు రోజుకి దారుణాలు పెరుగుతున్నాయని, నేరాలు చేసే వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టకుండా శిక్షించాలని అన్నారు. మరో వైపు ఈ బిల్లుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దిశ చట్టాన్ని తీసుకురావడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. చట్టాలు తీసుకురావడం ఎంత ముఖ్యమో, వాటిని అమలు చేయడం అంతకన్నా ముఖ్యమన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, నిర్లక్ష్యం వహించకుండా అమలు చేయాలని కోరారు.
[subscribe]