కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మే 4వ తేదీ నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవటంతో మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో షాపుల వద్దకు చేరుకున్నారు. కనీస భౌతిక దూరం కూడా పాటించకుండా మద్యం షాపుల వద్ద ప్రజలు భారీగా గుమిగూడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మద్యం ధరలను ఇప్పటికే 25 శాతం పెంచిన ప్రభుత్వం, మరో 50శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యంపై మొత్తం 75 శాతం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు కూడా వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీ ఎక్సైస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ అంశంపై మాట్లాడుతూ కొత్తగా మద్యంపై పెంచిన 50 శాతం ధరలు నేటి నుంచే అమలు కానున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని, మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో మళ్ళీ ధరలను పెంచినట్టు స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు బదులుగా 12 గంటలకు, ఒక గంట ఆలస్యంగా మద్యం దుకాణాలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu